Thursday, May 1, 2008

ప్రాచీన హోదాతో ఒరిగేదేంటి?

పార్లమెంటులో తెలుగుకు ప్రాచీనా హోదా గురించిన ప్రశ్న అడిగి సమాధానం వినే సమయమొచ్చినప్పుడు పత్తాలేకుండా పోయిన సభ్యురాలి గురించి చదివినప్పుడు నవ్వొచ్చింది. మనకేదో చేసేస్తున్నట్లు కనపడటమంటే ఎంత తపనో వీళ్లకి!

ఏ ఉద్దేశ్యంతో అన్నాడోగానీ, 'మనవాళ్లుత్త వెధవాయలోయ్' అని గిరీశం మహాశయుడన్నది మనవాళ్ల భాషాభిమానం విషయంలో మాత్రం పచ్చి నిజం. అరవ వాళ్లని చూసి మా భాషకి కూడా ప్రాచీన హోదా ఇవ్వమని కేంద్రాన్ని దేబిరించే బదులు రాష్ట్రం లోని అన్ని బళ్లలోనూ (అంటే .. ప్రభుత్వ, ప్రైవేటు, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ .. అన్ని రకాల బడులు) పదో తరగతి దాకా తెలుగు బోధన తప్పని సరి చెయ్యటానికి రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డేంటి? అసలు, ఎవరో ప్రాచీన హోదా ఇస్తే మన భాషకొరిగేదేంటి? అయితే గియితే, ఆ పేరుతో కొన్ని కోట్ల రూపాయల నిధులు వస్తాయి - అవీ ఏ రాజకీయుడి బంధుగణానికో సంతర్పణమే. కేంద్రాన్ని అడుక్కునే పని లేకుండా తెలుగుని నిజంగా ఉద్ధరించే మార్గాలు సవాలక్ష ఉండగా అవన్నీ పక్కనబెట్టి ప్రాచీన హోదా గురించి ఈ రచ్చ ఎందుకు? రాష్ట్రంలో తెలుగు మిణుకు మిణుకు మంటుంటే పట్టించుకోకుండా పరాయివాళ్లు మన వెలుగులు గుర్తించటంలేదని ఏడవటమేంటి?

ప్రభుత్వం సంగతి పక్కనబెడితే, ప్రైవేటు మీడియాలో తెలుగు ఎంత శుద్ధంగా అమలవుతుంది? ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఒకట్రెండు తప్ప మిగతా దినపత్రికల్లోగానీ, వార పత్రికల్లోగానీ రాసే తెలుగులో తెలుగెంత? టి.వి. ఛానళ్లు మరీ ఘోరం. యాంకరమ్మలు వంకర మాటలతో ఇటు తెలుగుని, అటు ఇంగ్లీషుని రెంటినీ నరికి పాతరేస్తున్నా ఆయా కార్యక్రమాల దర్శక నిర్మాతలు కిమ్మనరెందుకో! సినిమాల విషయం ఇక చెప్పక్కరలేదు. మొన్నటి దాకా హిందీ నాసికా గాయకాగ్రేసరుల ధాటికి ముక్కలు చెక్కలయిన పాటలనే విని తరించే వాళ్లం. ఇప్పుడు కొత్తగా డబ్బింగ్ రంగంలోకి కూడా పంజాబీ భామలు ప్రవేశించి చంపేస్తున్నారు! మరో వంక తమిళ దర్శకుల సమూహం 'పెద్ద పుడింగువా', 'పోడా మచ్చీ' లాంటి పదాలను విరివిగా తెలుగులోకి చొప్పించేసి మన భాషని సుసంపన్నం చేసేస్తుంది.

తెలుగుకి సంబంధించి ఇలాంటి చిన్నా పెద్దా సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. వేరే వాళ్లు మనభాషని గుర్తించటలేదని బాధపడటం ఆపి ముందు తెలుగు వాళ్లు తెలుగుపై అభిమానం పెంచుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చెయ్యటం మంచిది.

No comments: