Thursday, May 1, 2008

ఏకగ్గీవం

అనగనగనగనగనగనగా ఆ కాలంలో రాజుగారుబోతే ఆయన కొడుక్కో, జామాతకో రాజ్యమప్పజెప్పటం ఓ పద్ధతిగా ఉండేది. అరవయ్యేళ్ల కితం గాంధీగారు తెల్లోడి కాణ్నించి సొతంత్రం లాక్కొచ్చి ఇప్పించి 'పెజలారా, ఇయాల్టి నుండి రాజ్యాలు గీజ్యాలు బోయినయ్యి. ఇగనుండి మీరే ఈ దేశాన్నేలే రాజులు, ఇగనుండీ యాడ జూసినా పెజాసామ్మమే' అన్నారు. కామోసుననుకున్నాం. ఇదేదో బానే ఉందిలే అనిగూడా అనుకున్నాం.

మరిప్పుడేంది. ఈ కాంగిరేసోళ్లు, తెలుగుదేసపోళ్లు ఎవురన్నా ఎమ్మేల్లేలుబోతే ఆళ్ల కొడుకులకి, పెళ్లాలకీ ఎలచ్చను లేకుండా ఆ పదవిచ్చెయ్యాలని అంటాండారు? రాజ్యాలు గీజ్యాలు బోయినయ్యని గాంధీగారు జెప్పిందంతా ఉత్తుత్తిదేనా? పైగా దీనికేదో పేరుగూడా బెట్టిండ్రు - ఏకగ్గీవమంట. అవతలోళ్ల మీద సానుబూతితో ఆళ్ల సీటు ఆళ్లింటోళ్లకే ఇచ్చెయ్యాలంట.

పైనేడుండో గానీ మారాజు ఎన్టీవోడు మాబోటి జనాలకి రాజకీయం బలే నేర్పిబోయిండు. లేకపోతే ఈళ్లు జెప్పేదంతా నిజమేనని నమ్మేటోళ్లమే. అవతలోళ్ల మీద సానుబూతా పాడా. కైరాతాబాదులో తెలుగుదేసం, తెర్లాంలో కాంగిరేసు ఓడిపోయితీరతారని ఈళ్లకి తెగ నమ్మకం. అందుకే ఈ ఏకగ్గీవం అవిడియా. ఇయన్నీ జూస్తంటే నాకో బెమ్మాండమైన సేవింగ్సు అవిడియా వచ్చింది. వచ్చే జెన్రల్ ఎలచ్చన్ల నాటికి సెంద్రబాబు, రాజ్సేకర్రెడ్డి ఓ తాన కూకొని ఏడేడ వాళ్ల పార్టీలోళ్లు ఓడిపోతారో ముందే ఓ లిస్టేసుకుని ఆడాడ ఏకగ్గీవాలకొప్పుకుంటే బోలా? మిగతా సోట్ల మాత్రమే ఎలచ్చనుబెడితే బోల్డంత సోమ్మాదా గాదా ఏంది? తాప తాపకి ఎలచ్చన్లుబెట్టి ఊకినే జనాల సొమ్ము దుబారా సెయ్యటమెండుకంటా? అహ, నాకు తెలీకడుకుతాండ. సదువుకున్నోడివిగందా. నువ్వు జెప్పు.

No comments: