Thursday, April 24, 2008

ఓటేస్తే పెళ్లి ఫ్రీ

ఏప్రిల్ ఇరవయ్యో తారీఖు వార్త ఇది. రాష్ట్రంలో ఉప ఎన్నికలయ్యాక పేద ముస్లిములకు ప్రభుత్వ ఖర్చుతో సామూహిక పెళ్లిళ్లు చేయిస్తామని గౌరవనీయ మంత్రివర్యులు షబ్బీర్ ఆలీ గారు సెలవిచ్చారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లో ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు ఆ పని చేయలేరట! వెర్రి జనాలు ఎన్నికలయ్యేదాకా ఓటు మల్లన్నలు, అవయ్యాక బోడి మల్లన్నలు అని ఎంత నమ్మకమో పాపం జనాబ్ షబ్బీరాలీజీకి. ఈ సాయిబుగారికి తన సోదరుల మీద అంత ప్రేమ కారిపోతుంటే ఇన్నేళ్లూ ఏం వెలగబెట్టినట్లో! ముస్లిములలో కటిక పేదలుంటారనీ, వాళ్లు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారనీ ఈయనగారికివ్వాళే తెలిసిందా? అయినా, ప్రభుత్వాలుంది పేరంటాలు చేయించటానికా? ముస్లిములకి ఫ్రీ పెళ్లిళ్లు, హజ్ యాత్రలు, బ్రామ్మలకు ఉచితంగా ఉపనయనాలు, కిరస్తానీలకు ఫ్రీగా బాప్తిస్మాలు .. ఓటు కోసం కోటి తిప్పలు. అదేదో నాది కాకపోతే తాటి చెట్టుకు ఎదురు దేకుతా అన్నాడట వెనకటికో పెద్దాయన. పొయ్యేది వీళ్లసొమ్ము కాదుగాబట్టే నోటికొచ్చిన వాగ్దానమల్లా చేసేస్తారు. ఎన్నికలు సమీపించేకొద్దీ ఇంకేమేం సృజనాత్మక వాగ్దానాలు ఊడిపడతాయో వీళ్లనుండి.

Friday, April 18, 2008

కూలీ నంబర్ 1

తెరాస ఆవిర్భావం సందర్భంగా కెసియార్ కూలిపని చేసి రెండు రోజుల్లో పద్దెనిమిది లక్షల రూపాయలు సంపాదించాడట! అక్కడ కూలీలే రోజుకు లక్షలు కళ్లజూస్తుంటే, ఎవడండీ తెలంగాణ వెనకబడిందని చెప్పింది? వచ్చే నెలాఖరు ఉప ఎన్నికల్లో కెసియార్ చెయ్యబోయే వాగ్దానాలు మచ్చుకు కొన్ని:

1. తెలంగాణ రాష్ట్రమొచ్చాక ఇంటికో కూలీ ఉద్యోగం గ్యారంటీ
2. కూలీ పనికవసరమైన స్కిల్ సెట్ లేనోళ్లకి ముష్టి పని గ్యారంటీ (దీనికి అధమం రోజుకో పదివేలన్నా రావా?)

ఏతావాతా, తెలంగాణా వాళ్లకి కెసియార్ ఇవ్వబోయేది ప్రతి చేతికీ ఓ చిప్ప. తెలంగాణ పేరు చెప్పుకుని నాలుగేళ్లుగా ఎంత సంపాదించాడు ఈయన? ఎన్నెన్ని డెడ్ లైన్లు పెట్టాడు? రాష్ట్రాన్ని చీల్చటం అంత తేలిక్కాదని తెలియదా? రేపే తెలంగాణా తెచ్చిమ్మని ఎవరైనా అడిగారా ఈయన్ని? ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది అని రోజుకో తేదీ చెప్పటం, తీరా ఆ రోజొచ్చాక మొహం చాటెయ్యటం. ఇంకా ఎవర్ని మోసం చెయ్యటానికీ నాటకాలు? వీళ్లక్కావలసింది ప్రత్యేక తెలంగాణో, మరోటో కాదు. ఆ పేరుతో పబ్బం గడుపుకోవటం. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నారైలనుండీ, వేరేవాళ్లనుండీ వస్తున్న డబ్బంతా ఏమైపోతుంది? ఆ లెక్కలన్నీ ఎవరడుగుతారు, ఎవరు చెబుతారు? ఐదేళ్లకోసం ఎన్నిక చేసి చట్ట సభలకి పంపిస్తే వీళ్లు చేసింది మూడొచ్చినప్పుడల్లా రాజీనామా చెయ్యటం తప్ప మరేదీ లేదు. మళ్లీ మళ్లీ ఎన్నికలంటే, ఆ ఖర్చంతా ఎవడబ్బ సొమ్ము? అసలు, రాజీనామచేసి మళ్లీ ఎన్నికయ్యి ఈయన నిరూపించేదేమిటి?

ప్రత్యేక రాష్ట్రం కోసం రెచ్చగొడుతున్న వాళ్లని తెలంగాణ ప్రజలు ఓ ప్రశ్న అడగాలి. 'జనాల్లో సెంటిమెంటుంది', 'మా రాష్ట్రం మాకిచ్చేస్తే మా బతుకేదో మేం బతుకుతాం', 'ఇచ్చుడో చచ్చుడో', 'పంచుడో దంచుడో' లాంటి ఎమోషనల్ డైలాగులు వినటానికి బాగానే ఉంటాయి కానీ అసలు తెలంగాణా అంటూ ఏర్పడితే బండెలా లాగిస్తారో ఈ నేతలెన్నడన్నా చెప్పారా? చెప్పరు. ఎందుకంటే, ఆ విషయంలో వాళ్ల లెక్కలు వాళ్లకున్నాయి. ఊళ్లెలా పంచుకోబోతున్నారో దొంగలెన్నడన్నా బయటకు చెబుతారా? నలభై రెండుమంది ఎంపీలుండి, అందులో ముప్పైమంది అధికారపక్షం వాళ్లయితేనే మనకి కేంద్రంలో ముష్టి పడేసే దిక్కులేదు. ఇక రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా విడగొట్టి, ముక్కకో పదిమంది ఎంపీలని పడేస్తే ఎంత కమ్మగా ఉంటుందో ఊహించుకోవచ్చు. భారతీయులందరం ఒక్కటే అన్న భావన పెంచాల్సిన నేతలే కుల, మత, వర్గ, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య విభజన రేఖలు గీయటం దారుణం. అయినా, ఒక వంక ఎందరో తెలంగాణ సోదరులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఆయా దేశస్థుల పొట్టలు కొడుతూ, ఆంధ్రలో పుట్టి పెరిగి హైదరాబాద్ లో ఉద్యోగాల కోసం వచ్చినవాళ్లమీద కడుపుమంట చూపించటమేమిటి? అందునా, హైదరాబాద్ లో ఉండే ఉత్తర భారతీయుల మీద, ఇతర భాషల వారి మీద లేని ద్వేషం తెలుగు మాట్లాడే తోటి ప్రాంతాల వారిపై ఎందుకు? తెలంగాణని దోచేస్తుంది మరెవరో కాదు - అక్కడి నాయకులే. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చేయాల్సింది ఇంటిదొంగలకు దేహశుద్ధి చెయ్యటం.

Wednesday, April 16, 2008

యూజ్ అండ్ త్రో

'చంద్రబాబునాయుడు పెద్ద యూజ్ అండ్ త్రో నిపుణుడు. మావాళ్లని వాడుకుని వదిలేస్తాడు' అని దగ్గుబాటి పురందేశ్వరి గారు నిన్న విలేకర్లముందు వాపోయారు. ఎన్టీయార్ సంతానం తెలుగుదేశానికి పునర్వైభవం తెచ్చిపెట్టే ఆలోచనలో ఉన్నారని, ఆ విషయమై వాళ్లు చంద్రబాబునాయుడికి పూర్తి సహకారం అందించాలని నిర్ణయించుకున్నారని వచ్చిన వార్తలపై ఇది ఆమె ప్రతిస్పందన.

కడుపు చించుకుంటే కాళ్లమీదే పడటం అంటే ఇదే. మామ పుణ్యాన రాజకీయాల్లోకొచ్చి ఆనక - 1995 ఆగస్టు కుట్రలో - చంద్రబాబుతో చేతులు కలిపినప్పుడు పురందేశ్వరిగారి పతీశ్వరుడు చేసింది మాత్రం యూజ్ అండ్ త్రో కాదా? అప్పట్లో జరిగిన ఒక విలేకర్ల సమావేశంలో పెద్దల్లుడుగారు 'టి.డి.ఎల్.పి. లో టి.డి. మాదగ్గర ఉంది; ఎల్.పి. (లక్ష్మీ పార్వతి) మాత్రమే ఆయనకి మిగిలింది' అంటూ 'అన్ లాఫబుల్' జోకులెయ్యలేదా? పెద్దాయన పోయాక చంద్రబాబు పదవియ్యలేదని ఈయన గారు సిగ్గులేకుండా మళ్లీ ఆ ఎల్.పి. పార్టీలోనే చేరాడు. అక్కడా ఉపయోగంలేక కొన్నాళ్లకి బి.జె.పి.లోకీ, దాన్నుండి సతీ సమేతంగా ఇప్పుడున్న కాంగ్రెస్ లోకీ దూకాడు. ఎన్టీయార్ కూతురు తమ పార్టీలో ఉంటే తెదేకి చెక్ పెట్టొచ్చని కాంగ్రెసోళ్లు ఒప్పుకున్నారుగానీ లేకపోతే ఈయనగారొక్కడినే వాళ్లు రానిచ్చుండేవాళ్లా? ఆ కధంతా పురందేశ్వరి మర్చిపోయినా జనాలకి గుర్తే. పిచ్చి ప్రజలందరూ అమ్నీసియా రోజులని వీళ్ల వెర్రి నమ్మకం. రేపు కాంగ్రెస్ దిగిపోయి చంద్రబాబో, చిరంజీవో, మరొకరో అధికారంలోకొస్తే ఆ పార్టీలో చేరటానికి మళ్లీ వీళ్లే ముందుంటారు. ఇలాంటోళ్ల ప్రేలాపనలు వింటూ నవ్వుకోటం తప్ప మనం చేయగలిగేదేమీ లేదు.

అన్నట్టు, ఈమె పేరు పురందేశ్వరి. ఎందుకో తెలుగు పత్రికలోళ్లు 'పురంధరేశ్వరి' గా మార్చేశారు!