Wednesday, April 16, 2008

యూజ్ అండ్ త్రో

'చంద్రబాబునాయుడు పెద్ద యూజ్ అండ్ త్రో నిపుణుడు. మావాళ్లని వాడుకుని వదిలేస్తాడు' అని దగ్గుబాటి పురందేశ్వరి గారు నిన్న విలేకర్లముందు వాపోయారు. ఎన్టీయార్ సంతానం తెలుగుదేశానికి పునర్వైభవం తెచ్చిపెట్టే ఆలోచనలో ఉన్నారని, ఆ విషయమై వాళ్లు చంద్రబాబునాయుడికి పూర్తి సహకారం అందించాలని నిర్ణయించుకున్నారని వచ్చిన వార్తలపై ఇది ఆమె ప్రతిస్పందన.

కడుపు చించుకుంటే కాళ్లమీదే పడటం అంటే ఇదే. మామ పుణ్యాన రాజకీయాల్లోకొచ్చి ఆనక - 1995 ఆగస్టు కుట్రలో - చంద్రబాబుతో చేతులు కలిపినప్పుడు పురందేశ్వరిగారి పతీశ్వరుడు చేసింది మాత్రం యూజ్ అండ్ త్రో కాదా? అప్పట్లో జరిగిన ఒక విలేకర్ల సమావేశంలో పెద్దల్లుడుగారు 'టి.డి.ఎల్.పి. లో టి.డి. మాదగ్గర ఉంది; ఎల్.పి. (లక్ష్మీ పార్వతి) మాత్రమే ఆయనకి మిగిలింది' అంటూ 'అన్ లాఫబుల్' జోకులెయ్యలేదా? పెద్దాయన పోయాక చంద్రబాబు పదవియ్యలేదని ఈయన గారు సిగ్గులేకుండా మళ్లీ ఆ ఎల్.పి. పార్టీలోనే చేరాడు. అక్కడా ఉపయోగంలేక కొన్నాళ్లకి బి.జె.పి.లోకీ, దాన్నుండి సతీ సమేతంగా ఇప్పుడున్న కాంగ్రెస్ లోకీ దూకాడు. ఎన్టీయార్ కూతురు తమ పార్టీలో ఉంటే తెదేకి చెక్ పెట్టొచ్చని కాంగ్రెసోళ్లు ఒప్పుకున్నారుగానీ లేకపోతే ఈయనగారొక్కడినే వాళ్లు రానిచ్చుండేవాళ్లా? ఆ కధంతా పురందేశ్వరి మర్చిపోయినా జనాలకి గుర్తే. పిచ్చి ప్రజలందరూ అమ్నీసియా రోజులని వీళ్ల వెర్రి నమ్మకం. రేపు కాంగ్రెస్ దిగిపోయి చంద్రబాబో, చిరంజీవో, మరొకరో అధికారంలోకొస్తే ఆ పార్టీలో చేరటానికి మళ్లీ వీళ్లే ముందుంటారు. ఇలాంటోళ్ల ప్రేలాపనలు వింటూ నవ్వుకోటం తప్ప మనం చేయగలిగేదేమీ లేదు.

అన్నట్టు, ఈమె పేరు పురందేశ్వరి. ఎందుకో తెలుగు పత్రికలోళ్లు 'పురంధరేశ్వరి' గా మార్చేశారు!

1 comment:

రానారె said...

ధగ్గుభాటి :)